బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. అంతకుముందు ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్లేయర్లను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని సీఎం జగన్ చెప్పారు. అయితే సీఎం వైఎస్ జగన్ తొలుత క్రికెట్ పిచ్ పై బ్యాటింగ్ చేయమంటూ బ్యాట్ చేతికి ఇచ్చి మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు.
అనంతరం బ్యాట్ పట్టుకున్న రోజాకు పిచ్ పై దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం జగన్ క్రీజులో బ్యాట్ ఎక్కడ ఉంచాలో, క్రీజులో ఎలా నిలబడాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు. దీంతో ఆమె కూడా అంతే ఓపిగ్గా బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించారు. ఓసారి క్రీజులో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతినే ఆర్కే రోజా క్లీన్ షాట్ కొట్టేశారు.
దీంతో అక్కడే ఉన్న సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు చప్పట్లతో ఆమెను అభినందించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సీఎం జగన్ కూడా తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టారు. తద్వారా అక్కడ ఉన్న క్రికెట్ క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.