ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచాతప్పకుండా నెరవేరుస్తూ పేదలను, బీపీఎల్ కుటుంబాలను సంతోష పెడుతున్నారు. ప్రజాపాలన అభయహస్తం పేరుతో గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, వివరాలు సేకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం పథకాల అమలుపై ఫోకస్ పెట్టారు. అయితే 55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి, విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా ఈ నెల 12న సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ఇక దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించి మరోసారి గవర్నర్ కు సిఫారసు చేయనుంది కేబినెట్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని సీఎం చెప్పారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి.