కుటుంబ సభ్యుల ఒత్తిడితో మూడు ముళ్లతో ఏకమవుతున్న జంటలు, కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన దంపతులు ఏడడుగుల బంధంతో ఒక్కటైన జంటలు కొన్ని సగంలోనే పక్కదారి చూసుకుంటున్నాయి. అయితే 2019లో ఐరిస్ జోన్స్ అనే 83 ఏళ్ల బ్రిటీష్ మహిళకు ఒక ఫేస్బుక్ గ్రూప్లో 37 ఏళ్ల మహ్మద్ ఇబ్రహీమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్బుక్లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం.. కొన్ని రోజుల్లోనే స్నేహంగానే మారింది. ఇబ్రహీంపై తనకు ఫీలింగ్స్ రావడంతో.. 2019 నవంబర్లో ఐరిస్ ఈజిప్ట్ రాజధాని కైరోకి వచ్చింది.
అక్కడే ఇబ్రహీంని కలిసింది. ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులు కావడంతో.. ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ నగరంలో హనీమూన్ కూడా జరుపుకున్నారు. వీళ్లు తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు.. నెట్టింట్లో టాక్ ఆఫ్ ది కపుల్గా నిలిచారు. ఎందుకంటే.. వీరి మధ్య ఉన్న 46 ఏళ్ల వయసు వ్యత్యాసమే కారణం. పైగా వీళ్లు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటూ.. నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఐరిస్, ఇబ్రహీంల దాంపత్య జీవితం రెండేళ్ల వరకు సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ షాకింగ్ విషయాన్ని ఐరిస్ తాజాగా పంచుకుంది. తనకు ఇబ్రహీం అంటే చాలా ఇష్టమని, అతనికి సంబంధించి ప్రతీదీ తాను ఇష్టపడతానని పేర్కొంది. కానీ.. కొంతకాలం నుంచి తమ బంధం కష్టంగా మారిందని.. తాము ప్రేమలో ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో.. విడిపోవడమే మంచిదని భావించి, తాము విడాకులు తీసుకున్నామని కుండబద్దలు కొట్టింది. ఈ బాధ నుంచి కోలుకోవడం కోసం తాను పిల్లిని పెంచుకుంటున్నానని చెప్పింది. తాను మొదటి భర్తతో 1993లో విడాకులు తీసుకున్నానని.. 26 ఏళ్లుగా అతనితో టచ్లో లేనని కూడా వెల్లడించింది.