ఎన్టీఆర్ ఘాట్ వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వేకువజామున నివాళి అర్పించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. అయితే నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ… వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు.
గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు.