నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో భవ్యమైన రామమందిరంలో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన బాలరాముడిని చూసేందుకు భక్తులు వరుస కడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే రాములోరి గుడి తెరుచుకుంది. 7 గంటల నుంచి భక్తులను అనుమతించారు. అయితే తొలి స్పందన ఇదే..పూర్తిగా స్వర్ణాభరణాలతో దైవత్వం సంతరించుకున్న, ధగధగ మెరిసిపోతున్న అయోధ్య రామ మందిరంలోని బాల రాముడిని చూసి యావత ప్రపంచమే ఆశ్చర్యపోయింది.
రామయ్యను తమ మదిలో చిరస్థాయిగా ముద్రించుకున్నారు. యోగిరాజ్ కూడా బాల రాముడిని చూసి ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు భూమిపై ఉన్న అత్యంత అదృష్ట వంతుడిని నేనే. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది’ అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నాడు. ఎవరీ అరుణ్ యోగిరాజ్..అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని ఐదు తరాల ప్రసిద్ధ శిల్పుల వంశానికి చెందిన ఒక విశిష్ట శిల్పి.
ఆయన తన చిన్న వయస్సులోనే శిల్పకళా ప్రపంచంలోకి ప్రవేశించాడు. మైసూర్ రాజు ప్రోత్సాహాన్ని ఆస్వాదించిన తన తండ్రి యోగిరాజ్, తాత బసవన్న శిల్పి ద్వారా అరుణ్ ప్రభావితమయ్యాడు. ఎంబీఏ చదివి కార్పొరేట్ సంస్థలో పనిచేసిన అరుణ్ యోగిరాజ్కు శిల్పకళపై సహజమైన అభిరుచి ఉంది. అదే ఆయనను 2008లో మళ్లీ కళారూపంవైపు మళ్లించింది. అప్పటి నుంచి శిల్పాలను చెక్కుతూ వస్తున్నారు.

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శిల్పాలను చెక్కాడు. న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వెనుక ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం యోగిరాజ్ చెక్కిందే. రాముని విగ్రహంతో మరింత గుర్తింపు..ఇప్పటికే అనేక ఐకానిక్ విగ్రహాలను చెక్కిన అరుణ్ యోగిరాజ్.. తాజాగా రామ్ లల్లా విగ్రహాన్ని మలిచి అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. వెయ్యేళ్ల వరకు అరుణ్ పేరు అయోధ్యలో నిలిచిపోతుందని హిందువులు భావిస్తున్నారు.