వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. దీంతో జూలై 4వ తేదీ మధ్యాహ్నం నుంచి జూలై 7 వరకు ఏపీ​, తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఈదురుగాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయన్నారు. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

ముఖ్యంగా మంగళవారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

మంగళవారం నాడు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణకేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా కృష్ణా, ఏలూరు, కోనసీమ​, ప్రకాశం, పల్నాడు, ఉభయగోదావరిజిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల, అనకాపల్లిజిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *