ప్రముఖ కోలీవుడ్ నిర్మాత వి.ఎ.దురై కన్నుమూశారు. గత రెండు, మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన .. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. వి.ఎ.దురై వయస్సు 59 యేళ్ళు. చెన్నైలోని ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఇక వి.ఎ.దురై గతంలో రజనీకాంత్ తో బాబా అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆయనకు బాగా నష్టాలు వచ్చాయి.
అయితే తమిళంలో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత వీఏ దురై.. గత కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కాలుకు సర్జరీ చేయడం జరిగింది. అనంతరం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో బక్కచిక్కి పోయారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చివరకు కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం తన అనారోగ్యం గురించి చెబుతూ.. తాను కష్టాల్లో ఉన్నానని, ఆర్ధికంగా ఆదుకోవాలని ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు వీఏ దురై.

ఇది చూసి ఆ సమయంలో హీరో సూర్యతోపాటు పలువురు ప్రముఖులు స్పందించి ఆర్ధిక సాయం చేశారు. మందుల ఖర్చులకు కూడా డబ్బులేక అవస్థపడుతూ చివరి రోజులు గడిపారు నిర్మాత వీఏ దురై. అయితే ఆయన స్థితి తెలిశాక.. సూర్య 2 లక్షల రూపాయలు, కరుణాస్ 50 వేల రూపాయలు ఇచ్చారు. అలాగే రజనీకాంత్ , రాఘవ లారెన్స్ , విక్రమ్ కూడా తమకు తోచిన ఆర్ధికసాయం చేశారు. అయితే ఇప్పుడు ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.