డీఎస్పీ నళినినేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ల ద్వారా అర్థం అవుతుంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. – ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను. ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు.
ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. – తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఎప్పుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడెన్గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉంది. – ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు.
ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ను కూడా నేను కోల్పోయాను. సాంకేతికంగా కూడా పోలీస్ సర్వీస్ నిబందనలు నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే.. నా నియామకం రద్దు కావొచ్చు. – గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో, 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే.
అందుకే నేను ఉద్యోగం అడగను. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటాను. – త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రిని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న. ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే, ఇప్పుడు నాలో దైవ భక్తి నిండి ఉంది.