తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనే పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆగమాగం కావొద్దు. సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కాగజ్నగర్ ఎట్ల ఉండేనో.. తెలంగాణ అట్లనే ఉండే.
రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం రకరకాల ఇబ్బంది చూశాం. పొట్ట చేతపట్టుకుని వలసలు పోయారు. ఈ పదేండ్లలో ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల సమస్య లేదు. సిర్పూర్ గురించి మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లంబాడీ, ఆదివాసీ గూడెంలకు భగీరథ నీళ్లు వస్తున్నాయి. కరెంట్ బాధ కూడా లేదు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం.
ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. అన్ని వర్గాలకు కరెంట్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇలా సమస్యలు పరిష్కరించుకున్నాం. పేదలకు మంచి చేసుకున్నాం. ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచి పనులు చేపట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అవుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ తగ్గింది అని కేసీఆర్ తెలిపారు.