ఎన్నికల ప్రచారం సమయంలో.. ప్రజలకు భారీ హామీలిస్తారు.. తీరా గెలిచాక మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనీసం జనాలు ముఖాలు చూడరు. ఏదో ఎన్నికల ముందు ఆదరాబాదరా.. కొన్ని హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. అయితే గుంటూరు చెందిన 19 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంది.
ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న అతడికి అవయవాలు దానం చేసేందుకు కట్టా కృష్ణ కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. అయితే గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తీసుకురావాల్సి ఉంది. అత్యవసరంగా తరలించాల్సి ఉండటంతో రోడ్డు మార్గంలో తీసుకువెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఎమర్జెన్సీ కావడంతో రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుంది. ఈ విషయం అధికారుల ద్వారా సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన జగన్.. గుండె తరలించేందుకు వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.
జగన్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆగమేఘాలపై హెలికాప్టర్ ఏర్పాటు చేసి గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలించారు. గుంటూరు నుండి తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ‘గుండె’ చేరగా.. రోగికి ప్రస్తుతం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స కొనసాగుతోంది. అతడిని బ్రతికించేందుకు జగన్ చూపించిన చొరవకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించడంపై కుటుంబసభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.