తాను ఏం చేశానో చెప్పుకుండా అరెస్టు చేశారని ఆయన మీడియాతో అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా, తాను చేసిన నేరం ఏమిటో నిరూపించకుండా అరెస్టు చేశారని, అది చాలా తప్పు అని ఆయన అన్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధిక సంఖ్యలో పోలీసులు చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. దీనికోసం అనంతపురం నుంచి నంద్యాలకు పోలీసు బృందాలను రప్పించారు. అలా మొత్తం ఆరు బస్సుల్లో ఎస్పీ కార్యాలయం వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి.
డీఐజీ రఘురామరెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు భారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలి వచ్చిన టిడిపి శ్రేణులను అరెస్టులు చేశారు. శనివారం ఉదయం ఐదు గంటల తర్వాత వాహనం చుట్టూ ఉన్న టిడిపినేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల, ప్రియ జగద్విఖ్యాతిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి తదితర స్థానిక టిడిపి నేతలు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు తన బస చేసిన బస్సు నుంచి కిందికి దిగడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మరోవైపు, అరెస్టకు ముందు 6 గంటలపాటు నంద్యాలలో హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటలనుంచే అటు టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా పోలీసులు, సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున చంద్రబాబు బస చేసిన చోటికి వెళ్లారు. దీనికి ముందే నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్ కే ఫంక్షన్ హాల్ లోకి ఎలా వెళ్లాలి, టీడీపీ శ్రేణులను ఎలా అడ్డుకోవాలి… అని పక్కా ప్రణాళిక ప్రకారం సీఐడీ వెళ్లినట్లుగా తెలుస్తోంది.