మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే..వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. ఆయిలీ ఫుడ్ లేదా వ్యర్ధ పదార్ధాలు తినడం వల్ల నేరుగా కడుపుపై ఆ ప్రభావం కన్పిస్తుంది. బయటి తిండి తినడం వల్ల సహజంగానే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఏదైనా తినేలోపు కడుపు నిండుగా ఉండటం, సర్వసాధారణంగా గ్యాస్ సమస్యతో బాధపడేవారిలో ఉండే లక్షణం. అలాగే ఎసిడిటీ కూడా మరింత ప్రమాదకమైందే. సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కడుపులో ఆమ్ల గుణాలు మంటను కలిగిస్తాయి.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ , ఎసిడిటీతో బాధపడే వారు తమ ఇబ్బంది నుంచి బయటపడేందుకు అప్పటికప్పుడు ఏదో మాత్రలు వేసుకోవడం సర్వసాధారణంగా జరిగేదే. ఇది మరింత ప్రమాదమంటున్నారు వైద్యులు. అయితే ఈ సమస్యల కోసం సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. కడుపులో మంట, ఉబ్బరం వంటి వాటిని ఈజీగా అధిగమించేందుకు ఇలా చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగితే అజీర్ణ సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆనీటిని బాగా మరింగించి వేడిగా ఉండగానే టీ తాగినట్టుగా తాగితే మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. అల్లం ముక్కలను బాగా దంచి రసం తీసి దాన్ని తాగినా అజీర్ణం సమస్య పరిష్కారమవుతుంది. గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి తాగితే అజీర్ణ సమస్య తగ్గుముఖం పడుతుంది. మన శరీరానికి అవసరమైన నీటిని అందిస్తూనే .. నూనెలు అధికంగా ఉండే పదార్ధాలకు వాటికి దూరంగా ఉంటే ఇటువంటి సమస్యలనుంచి బయటపడే అవకాశాలున్నాయి.