వైఎస్ వివేకా ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు.. ఐదేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు సునీత. కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, తీర్పు నాకు కావాలన్నారు. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది.. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు.. సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం,
ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. వివేకా హత్యకేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారని.. సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ ను అడిగానన్నారు. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది.. నాకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని అన్నారు సునీత.
ముందు సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ కు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సునీత. విలువలు, విశ్వసనీయత పదే పదే అంటుంటారు.. మాట తప్పను, మడమ తిప్పను అంటుంటారు – మా నాన్న హత్య కేసులో ఇవన్నీ ఏమయ్యాయి?.. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందన్నారు. హత్యా రాజకీయాలు ఉండకూడదు.. జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దన్నారు.