శృతి భర్త అరవింద్ శేఖర్ ఆగస్ట్ 2న గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం అరవింద్ ఒక్కసారిగా గుండెపోటుకి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అరవింద్ శేఖర్ తుదిశ్వాస విడిచాడు. అయితే గతేడాది వీరికి వివాహమైంది. అయితే ఇంతలోనే కేవలం 30 ఏళ్ల వయసులోనే అరవింద్ కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ఈనేపథ్యంలో నటి శ్రుతితో పాటు కుటుంబ సభ్యులకు చాలామంది అభిమానులు, నెటిజన్లు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అరవింద్ ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో అరవింద్ మరణంపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియా రకరకాలుగా దుష్ఫ్రచారం చేస్తున్నాయి. మంచి బాడీ బిల్డరైన అరవింద్ హఠాన్మరణానికి అతనికున్న చెడు అలవాట్లే కారణమంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భర్త మరణంతో ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన శ్రుతి, అలాగే అరవింద్ కుటుంబ సభ్యులకు ఈ కథనాలు మరింత ఆవేదనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రుతి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన భర్త మరణంపై తప్పుడు ప్రచారం చేయద్దని చేతులెత్తి అభ్యర్థించింది.
‘ప్రస్తుతం నేను చాలా క్లిష్టమైన పరిస్థితలో ఉన్నాను. చాలా మంది నన్ను ఓదార్చేందుకు కాల్స్, మెసేజ్లు పంపిస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలో యూట్యూబ్ ఛానెల్స్ , మీడియా వారందరికీ నాదొక మనవి. నా భర్త కార్డియాక్ అరెస్టుతోనే కన్నుమూశారు. డాక్టర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ నిజమేంటో తెలుసుకోకుండా మా ఆయన మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మీ వ్యూస్ కోసం, లైకుల కోసం మమ్మల్ని ఇలా వేధించకండి’ అని రిక్వెస్ట్ చేసింది శ్రుతి.