దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే.! సామాన్యుడు టమాటా పండ్లను కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. కానీ టమాటా రైతులు మాత్రం భారీ లాభాలు గడించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరడంతో ఆ రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే మహారాష్ట్ర పూణె జిల్లాకు చెందిన తుకారం భగోజీ కుటుంబం 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూనే ఉంది.
ఆయా సీజన్ల ఆధారంగా పంటలు పండిస్తుంది. ఐదేళ్లుగా టమాటా పంట పండిస్తుంది. ఎప్పుడూ నష్టాలే.. ఈ ఏడాది మాత్రం 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు తుకారం. నెల రోజులుగా పంట చేతికి వస్తూ ఉంది. 12 ఎకరాల్లో 13 వేల బాక్సుల టమాటా దిగుబడి వచ్చింది. ఒక్కో బాక్సులో 20 కిలోల టమాటా ఉంటుంది. మొత్తం 13 వేల డబ్బాల టమాటాను విడతల వారీగా విక్రయించింది తుకారం ఫ్యామిలీ. తుకారం కోడలు సోనాలి ఆధ్వర్యంలో నారాయణగంజ్ మార్కెట్ లో వీటిని అమ్మారు.
టమాటా నాణ్యత ఆధారంగా కిలో 80 నుంచి 125 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముడుపోయింది పంట. జులై 14వ తేదీ ఒకే రోజు 900 బాక్సులను అమ్మగా.. 18 లక్షల రూపాయలు వచ్చింది. అదే విధంగా 2 వేల 500 బాక్సులను 100 రూపాయల చొప్పున విక్రయించింది ఆ కుటుంబం. కిలో 80 రూపాయల చొప్పున 6 వేల డబ్బాలను.. ఇలా నెల రోజుల్లో 13 వేల బాక్సులను అమ్మగా.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చాయి.
20 ఏళ్ల దరిద్రం మొత్తం ఈ ఒక్క ఏడాదితో పోయిందని.. ఐదేళ్లుగా టమాటా పంటనే నమ్ముకున్నామని.. ఎప్పుడూ లాభాలు రాలేదని.. ఈసారి పంట బాగా పండటంతోపాటు.. ధర కూడా ఎక్కువగా ఉండటంతో.. కోటి 50 లక్షల రూపాయలు వచ్చిందని చెబుతోంది తుకారం కుటుంబం. ప్రస్తుతం పొలంలో ఇంకా కొంచెం పంట ఉందని.. ధర ఇదే విధంగా ఉంటే.. రాబోయే 15 రోజుల్లో మరో 50 లక్షల రూపాయల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.