రేవంత్ రెడ్డి..స్వతంత్ర అభ్యర్థిగా 2007లో జడ్పీటీసీ ఎన్నికల్లో మొదట పోటీ చేశారు. ఫస్ట్ టైంలోనే విజయం సాధించడంతో ప్రధాన పార్టీలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయనకు చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. దీంతో రేవంత్ రెడ్డి 2009లో టీడీపీ నుంచి కొడంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ హవా సాగుతున్న సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గుర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు.
అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెలుగులోకి వచ్చారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అదే పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే టీడీపీ అధికారంలో లేకున్నా ఆ పార్టీ ద్వారానే పలు పోరాటాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం ఆహ్వానించింది. దీంతో 2018లో ఆ పార్టీలో జాయిన్ కావడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఇదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
ఆ తరువాత రేవంత్ రెడ్డి దూకుడును బాగా గమనించి పార్టీ అధిష్టానం ఆయనకు 2021లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలో కాంగ్రెస్ లో ఎన్నో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి ఒక్కొక్కటి పరిస్కించుకుంటూ వచ్చి పార్టీని గాడిలో పెట్టారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడంతో ఒక దశలో సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించారు. కానీ ఎంతో సహనంతో పార్టీని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు.