ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈయన ఏం చేసినా సంచలనమే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండాల్సిందే. అంతలా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జనసేన కార్యకర్తలు, అభిమానుల అంచనాలకు అనుగుణంగా పాలనతో తన మార్క్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాను చేపట్టిన కీలక మంత్రిత్వశాఖల మీద సమీక్షలు, సర్వేలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విలేకర్ల సమావేశంలో అసహనంతో మైక్ విసిరిగొట్టి వెళ్లిపోయినట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం ఆ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు.
సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ చేతిలోని మైక్ కింద పెట్టేసి వేగంగా వెళ్లిపోయారు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మైక్ పనిచేయకపోవటంతో.. ఇంట్రెస్ట్ పోయిందని పవన్ కళ్యాణ్ మైక్ విసిరేసి వెళ్లిపోయారంటూ కొందరూ.. సుగాలి ప్రీతి కేసుపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారంటూ మరికొందరు.. ఇలా ఎవరికి తగినట్లు వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.