ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ సీట్లతో గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమి వైపు నిలబడ్డారు. అంతేకాకుండా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. 21కి 21 సీట్లను సొంతం చేసుకుంది. దీంతో చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.
కాగా టీడీపీ 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 8 సీట్లు కైవశం చేసుకుంది. అయితే ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లిన పవన్ తన చాంబర్ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు. సుమారు గంటన్నరపాటు సెక్రటేరియట్లో గడిపిన సేనాని.. రెండో బ్లాక్లో ఉన్న తన చాంబర్ను నిశితంగా పరిశీలించారు. అనంతరం మొదటి బ్లాక్కు వెళ్లిన పవన్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికిన సీఎం, ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం పేషీలో కూర్చోని సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ముచ్చటిస్తూ నవ్వుకున్నారు కూడా.!. భేటీ కావడానికి వచ్చిన పవన్కు సీటులో నుంచి లేచి ఎదురెళ్లి మరీ.. ఆలింగనం చేసుకున్న సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. సీఎం చాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించిన పవన్.. ‘మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారు సార్’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ‘ధన్యవాదాలు పవన్’ అని అన్నారు.