అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేస్తుంటారు. ప్రతిసారి ఎంతో మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేస్తారు. ఎన్నికల బరిలో ఉంటారు. కానీ ఎవరి పేరు మనకు మనకు పెద్దగా గుర్తుండదు. అయితే బర్రెలక్క వంటివారిని చూసి తెలంగాణ అంతటా ప్రశ్నించే వాతావరణం, అసమ్మతి వ్యక్తీకరణ ఉందని అనుకోలేము. చివరికి ఈ ఎన్నికల ఫలితం, అధికారపార్టీకి హ్యాట్రిక్ దక్కడమే కావచ్చు, కింగ్ మేకర్తోనో లేకుండానో త్రిశంకు సభ ఏర్పడనూవచ్చు, కాంగ్రెస్కే ఘనవిజయం దొరకవచ్చు.
ఎవరు ఉన్నా, మరెవరు ఊడినా, ప్రజల సమస్యలు మాత్రం ఉనికిలోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ, ఒత్తిడిచేసి పనిచేయించుకుంటూ ఉండాలనే ప్రజాస్వామిక స్పృహ ప్రజలలో పెరిగితే పరిస్థితులలో కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వాలు దాన్ని సులువుగా అనుమతిస్తాయని కాదు. ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఎన్నికలలో నిలబడడం సరే, దాని ఫలితంతో నిమిత్తం లేకుండా బర్రెలక్క, ఆమె అభిమాన సహచరులు నిరంతర ప్రజాచరణలో కొనసాగడమే అందుకు మార్గం.
పదిసంవత్సరాల నుంచి మాటలే తప్ప ప్రభుత్వం నుంచి ఏ చేతలూ లేని గల్ఫ్ కార్మికుల సమస్యలకు గొంతివ్వడానికి అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీచేస్తున్నారు. ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరొక చోట ఒక ఎన్నారై యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. ఓటు పోరాటాన్ని మార్పుకు సాధనంగా పరిగణించి పోటీలో ఉన్నారు.