సోషల్ మీడియా అకౌంట్ ఉండి బోలెడంత ఫ్యాన్బేస్ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగానే సుపరిచితం. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ మళ్లొచ్చిన.. అంటూ ఎప్పుడూ రైతు పడే కష్టాలే చెప్తుంటాడు. అందుకే బిగ్బాస్ 7 లాంచ్ రోజు బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలు సిసలైన రైతుబిడ్డ అని నిరూపించుకున్నాడు. అయితే హౌస్లో ఇలా ఉంటే సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే ప్రశాంత్ అసలు పేదవాడు కాదని అతనికి కోట్లాది రూపాయల ఆస్తులున్నాయంటున్నారు చాలామంది. మొత్తం 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, లగ్జరీ హౌస్ ఉందంటూ ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్లపై పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ ‘మా వాడి గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు.
26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవనాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ నిజంగా అవన్నీ ఉంటే మా అబ్బాయి బిగ్బాస్కు ఎందుకు వెళతాడు? నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు కదా? అసలు మావాడికి 26 ఎకరాల పొలం ఎక్కడున్నాయో చూపించండి. మాకున్నదల్లా కేవలం ఆరెకరాల పొలం మాత్రమే! దాన్ని అందరికీ పంచితే ప్రశాంత్కు కేవలం రెండెకరాలు వస్తాయంతే. నా బిడ్డపై చిన్నచూపు చూస్తుంటే చాలా బాధేస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.