ఐశ్వర్యకు ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగులో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఐశ్వర్య రాజేష్.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది.
అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. ఎవరి జీవితం పూల పాన్పు కాదని అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయని తెలిపింది. ఇండస్ట్రీకి రాక ముందు, వచ్చాక కూడా ఐశ్వర్య కష్టాలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ”నేను 8 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయా, అదీ కాక ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే సోదరులు రోడ్డు ప్రమాదం మరణించారు. జీవితం నాకు ఒకదాని తర్వాత ఒకటి పాఠం నేర్పూతూనే ఉందని వాపోయింది.
నాకు స్టార్ కథానాయిక అన్న పేరు రాకపోయినా పర్వాలేదనీ, కానీ మంచి నటి అన్న పేరు తెచ్చుకుంటే చాలు అంటూ చెప్పుకొచ్చింది. ప్రేక్షకుల్లో నిలిచిపోయే పాత్రలకే తాను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని” తెలిపింది. ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయే అయినప్పటికీ తమిళంలో కథానాయికగా స్థిరపడింది. అవకాశం వస్తే తెలుగులో సైతం తన టాలెంట్ ను చూపిస్తూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఐశ్వర్య.