భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడింది. పాండవ వనవాసములో అర్జునుడు బృహన్నల్లగా జీవిస్తాడు. హిజ్రాలు లేదా తృతీయ ప్రకృతి కలిగిన వారు మన సమాజానికి కొత్త కాదు. మన దేశ చరిత్ర పూర్వనుండి హిజ్రాలు, లింగమార్పిడిదారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది. అయితే బీహార్ ముజఫర్పూర్ బోచాహా పోలీస్ స్టేషన్ పరిధి రాంపూర్ జైపాల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఏ పనీ చేయకుండా స్థానికంగా జులాయిగా తిరుగుతుండేవాడు. ఇటీవల అతడు ఇదే ప్రాంతంలో నిర్వహించిన స్టేజ్ షోకి వెళ్లాడు. అక్కడ స్టేజిపై ఓ 19 ఏళ్ల హిజ్రా ప్రదర్శనకు ఫిదా అయ్యాడు.
కార్యక్రమం అనంతరం హిజ్రా వద్దకు వెళ్లి.. ‘‘మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా’’.. అని చెప్పాడు. దీంతో ముందుగా హిజ్రా ఇందుకు అభ్యంతరం తెలియజేసింది. ‘‘నేను ఒక హిజ్రాను.. నన్ను పెళ్లి చేసుకున్నా.. నీకు పిల్లల్ని కనిపెట్టలేను.. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు’’.. అని సలహా ఇచ్చింది. అయినా సదరు యువకుడు మాత్రం ఆమెను రోజూ వెంబడిస్తూ ఉండేవాడు. ఇలా రోజూ తన చుట్టే తిరుగుతుండడంతో చివరకు హిజ్రా కూడా పెళ్లికి అంగీకరించింది.
ఎట్టకేలకు ఆమెను పెళ్లి చేసుకున్న యువకుడు.. తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తన భార్య స్టేజ్ షోల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం తీసుకునేవాడు. ఈ మొత్తంతో కొత్త ఇంటిని నిర్మించడంతో పాటూ తన అన్నకు వివాహం కూడా చేశారు. వివాహమైన ఆరు నెలల తర్వాత నుంచి భార్యను వేధించడం మొదలెట్టాడు. అయినా ఆమె ఓపిగ్గా భరిస్తూ వచ్చింది. అయితే అంతటితో ఆగన యువకుడు.. ‘‘నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో’’.. అంటూ బయటికి గెంటేశాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.