2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. అయితే మొదట్లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని రూ. 300కు పెంచింది. ఈ పథకం కింద సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీని అందిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది.
టార్గెట్ 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభిస్తోంది.

ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముడి జనపనార మద్దతు ధర పెంచింది. 2024-25 సీజన్లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర(MSP) క్వింటాల్కు రూ. 5,335 గా పేర్కొంది, గత సీజన్తో పోలిస్తే క్వింటాల్కు రూ. 285 పెంచమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే రూ. 10,000 కోట్ల బడ్జెట్తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.