తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో పలువురు పేర్లు వినిపించాయి. వారిని దర్యాప్తు సంస్థలు పిలిచి విచారణ కూడా చేశాయి. తాజాగా ఆ లిస్టులో ఉన్న నవదీప్ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ పై హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ నుంచి డ్రగ్స్ పూర్తిగా దూరం కాలేదు. ఆ మధ్యన నిర్మాత కెపి చౌదరిని పక్కా ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అతడి వద్ద డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి విచారణ మొదలు పెట్టిన పోలీసులు ఫోన్ కాల్స్, గూగుల్ డ్రైవ్ ఆధారంగా సంచలన విషయాలు వెలుగులోకి తీస్తున్నారు. కెపి చౌదరి కాల్ డేటాలో సినీ, టివి రంగానికి చెందిన కొందరు సెలెబ్రిటీల నంబర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు వారితో కె పి చౌదరి వందలకొద్దీ ఫోన్ కాల్ సంభాషణ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు పక్కా గా వలపన్ని ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్ల సహాయంతో సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తూ పలువురికి విక్రయిస్తున్నారట. సుశాంత్ రెడ్డి నుంచి డ్రగ్స్ కొన్న వారిలో ఓ మాజీ ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన కెపి చౌదరి.. సుశాంత్ రెడ్డితో పలు మార్లు ఫోన్ సంభాషణ సాగించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ సుశాంత్ రెడ్డి.. ఇప్పుడు అరెస్ట్ అయిన సుశాంత్ రెడ్డి ఒక్కరేనా లేదా వేరా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా తరచుగా వెలుగులోకి వస్తున్న డ్రగ్స్ కేసులు టాలీవుడ్ కి మాయని మచ్చలా మారుతున్నాయి. కెపి చౌదరి డ్రగ్స్ వివాదంలో సురేఖ వాణి, నటి జ్యోతి లాంటి సినీతారల పేర్లు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో తమ ప్రమేయాన్ని వారు ఖండించారు.