నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు. విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి. వీరిలో చిన్న వారైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. అయితే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
కాగా మంగళవారం మధ్యాహ్నం శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా తండ్రి పార్థీవ దేహాన్ని చూసి దిల్ రాజు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చేశారు. ఇదే సమయంలో అంత్యక్రియలకు హాజరైన ప్రకాశ్రాజ్ దిల్రాజుకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అంతకుముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిల్ రాజు ఇంటికి వెళ్లి శ్యామ్ సుందర్ మృతదేహానికి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, నిర్మాత సుధాకర్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్, సింగర్ సునీత, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితర సినీ ప్రముఖులు దిల్రాజు ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు.
అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, కేవీపీ రామచంద్ర రావు వంటి రాజకీయ ప్రముఖులు దిల్రాజును కలిసి తమ సానుభూతిని తెలియజేశారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి. కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. వీరికి దిల్రాజుతో సహా మొత్తం కుమారులు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన దిల్రాజు సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నితిన్తో దిల్ లాంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించి అదే తన పేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగాపవర్ స్టార్ రామ్చరణ్తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చాలా భాగం వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.