బిపాషా బసు తన 17 యేళ్ల సినిమా అనుభవంలో ఎన్నో అవార్డులను గెలుపొందింది. మొత్తం 31 అవార్డులను కైవసం చేసుకోగా మరో 46 సందర్భాలలో ఈమె పేరు అవార్డు కొరకు ప్రతిపాదించబడింది. అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్లో నటి నేహా ధూపియాతో మాట్లాడిన బిపాసా.. దేవి పుట్టిన 3 రోజులకు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిసిందని, మూడు నెలల వయస్సులో సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారని బోరున ఏడ్చేశారు. ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని బిప్స్ చెప్పుకొచ్చారు. ‘మా ప్రయాణం సాధారణ అమ్మ-నాన్నల కంటే చాలా భిన్నంగా సాగింది.
ప్రస్తుతం నా ముఖంలో చిరునవ్వు ఉంది కానీ.. గతంలో ఎన్నో కఠినమైన రోజులు గడిపాను. ఏ తల్లికీ ఇలా జరగాలని నేను కోరుకోను. నాకు పాప పుట్టిన మూడో రోజే.. గుండెలో రెండు రంధ్రాలతో పుట్టిందని తెలిసింది. నేను దీన్ని ఎవరితో షేర్ చేయకూడదనుకున్నాను. కానీ ఈ ప్రయాణంలో నాకు ఎంతో మంది తల్లులు సహాయం చేశారు. వారిని కనుగొనడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను’ అని బిపాషా బసు ఇన్స్టాగ్రామ్ లైవ్లో తెలిపారు. ‘పాపకు ఉన్న వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏమిటో కూడా కరణ్, నాకు అర్థం కాలేదు. మేము మా కుటుంబంతో దీని గురించి చర్చించలేదు. శస్త్రచికిత్స గురించి కరణ్, నేను సిద్ధం అయ్యాం.
మొదటి ఐదు నెలలు మాకు చాలా కష్టంగా గడిచాయి. ఐతే దేవి మొదటి రోజు నుంచే బాగుంది. డాక్టర్స్ ప్రతి నెలా స్కాన్ చేయించుకోవాలని చెప్పారు. గుండెలో పెద్ద రంధ్రం కారణంగా మూడు నెలల వయస్సులో శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని చెప్పారు. మూడవ నెలలో నేను ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడా. పాప అన్ని రిపోర్ట్స్ చూశా, సర్జన్లను కలిసి శస్త్రచికిత్సకు సిద్ధం అయ్యా. పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కరణ్ బయపడ్డాడు. సుమారు ఆరు గంటల పాటు సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుంది’ అని బిప్స్ చెప్పుకొచ్చారు.