అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆరోజు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీర సాగర మథనం సమయంలో విష్ణు మూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్ర నామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జనవరి 22న్ వేకువజామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి.
మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇక పీఠం వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమని దాని మీద పెట్టాలి. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవాలని విషయం మాత్రం మరవద్దు. ధూపం, ధీపం వేయాలి. రాముని అనుగ్రహం పొందటం కోసం పుష్పాలు సమర్పించాలి. స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. శ్రీరామునితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించడం మంచిది. ఈ పవిత్రమైన రోజున రామ చరిత మానస్, శ్రీరామ రక్ష స్త్రోత్రం, సుందర కాండని పారాయణం చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది.

అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు దూరదర్శన్ చానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షితలు ఇంటింటికీ పంచారు. పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షితలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీ రాముడు ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్టించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్లకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యం మీకు దక్కుతుంది.