ఖాకీ చొక్కా ధరించి మహిళా ఆటో డ్రైవర్స్ తో సరదాగా సెల్ఫీలు దిగారు. వారితో పాటు కాసేపు మంత్రి రోజా కూడా ఆటో నడిపి ఆకట్టుకున్నారు. అయితే శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ లోని ఏపీ సీఎం విజయవాడ నుండి ప్రారంభించిన వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా లబ్ధిదారులతో కలిసి వీక్షించారు. అనంతరం మహిళా ఆటో డ్రైవర్స్ తో సరదాగా సెల్పీలు దిగి, వారితో కలిసి మంత్రి రోజా ఆటో నడిపారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత వాహనాలు కలిగిన ఆటో, ట్యాక్సీ, క్యాబ్ వాహన యజమానులకు, డ్రైవర్లకు ఐదో విడత వాహన మిత్రను విజయవాడలోని విద్యాధర పురం నుండి దాదాపు 2,75,930 మంది లబ్ది దారులకు సుమారు 276 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని అన్నారు. పేద ప్రజలకు తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చలించిపోయి, వాటిని దూరం చేస్తానని వాగ్ధానం చేశారో తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండే అవన్నీ నెరవేరుస్తూ దాదాపుగా 97 శాతం మేర ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చడం జరిగిందని అన్నారు.
ఈ రోజుతో 5 విడతలకి కలిపి రూ.1,301 కోట్లను వాహన మిత్ర ద్వారా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకే కాకుండా వారి కుటుంబాల్లో చదువుతున్న పిల్లలకు కూడా అమ్మ ఒడి, అర్హులైన మహిళలకు వైఎస్ఆర్ చేయూత, ఆ మహిళలలో ఎవరైనా డ్వాక్రా సంఘాలలో ఉంటే వారికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారని, వారి పిల్లలకి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం విద్య అమలుతో పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎనలేని మేలు చేస్తున్నారని ఆమె తెలిపారు.