తొలిసినిమా ‘ఏ మాయ చేశావే’తోనే వీళ్లిద్దరూ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ బెస్ట్ పెయిర్ అనిపించుకోవాలని ఆరేళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి అప్పట్లో దక్షిణాదిలో హాట్ టాపిక్ అయింది. అయితే హఠాత్తుగా ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యేవాళ్లకు చైసామ్ పెళ్లి ఫోటోలతో పాటు వాళ్లిద్దరూ విహార యాత్రకు వెళ్లిన ఫోటోలు సైతం కనిపిస్తున్నాయి.
ఈ ఫోటోలను చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చై, సామ్.. ఇద్దరూ కలవబోతుంటే అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే మంచి వార్తే ఉండదు. నాగచైతన్యకు సంబంధించిన ఫొటోలు కనపడకుండా ఆర్చీవ్ చేసిన సమంత వాటిని తిరిగి ఇన్ స్టా లోకి వచ్చేలా చేయడంతో ఏం చెప్పబోతుందా? అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి జోడి సూపర్ అని, బెస్ట్ కపుల్ అని, క్యూట్ జోడీ అని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
విడాకులు తీసుకున్న సమయంలో అందరూ ఎక్కువగా సమంతనే టార్గెట్ చేశారు. నాగచైతన్య గురించి ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటున్నారు. ఇద్దరికీ వేర్వేరుగా క్రేజ్ పెరుగుతోంది. చైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సామ్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నటన పరంగా వంక పెట్టే పనిలేకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.