గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. రాయచూర్కు చెందిన బాలిక తల్లిదండ్రుల సమక్షంలోనే దత్తత తీసుకుంటున్నట్లు వీడియోలో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత తీసుకునే వ్యక్తికి, బిడ్డకు మధ్య దత్తత కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను తీసుకోవాలి.
ఇవేమీ చేయకుండా బాలికను అక్రమంగా అప్పగించడంతో వివాదం చెలరేగింది. ఇందులో బాలిక తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. అంతేకాకుండా.. సోనూ ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్న విషయాన్ని వెల్లడిస్తూ.. మార్చి 2న ఫొటోలు, రీల్స్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. బాలికను చట్ట విరుద్ధంగా దత్తత తీసుకోవడం, విధి విధానాలను విస్మరించడం, ప్రచారం కోసం బాలికను ఉపయోగించుకోవడం వంటి ఆరోపణలపై సోను శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదైంది.
దత్తత తీసుకున్న బాలిక ఫొటోను సోషల్ మీడియాలో రివీల్ చేయడం 1974 బాల్య న్యాయ చట్టం ప్రకారం విరుద్ధం. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆధారంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోనూ సెలబ్రిటీ హోదా కోసం బాలికను దత్తత తీసుకుందనే ఆరోపణలు వివాదానికి దారితీసింది.
దత్తత తీసుకోవడంతో విధివిధానాలను పాటించడంలోనూ ఆమె విఫలమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు గత శుక్రవారం పోలీసులు అమెను అరెస్ట్ చేసి, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. తాజాగా ఆమెను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.