అండాన్ని దాచుకోవచ్చు… కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు.. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు అడ్డు కాకూడదని కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్ను కలిగివున్నవారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైనవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, ఈ సర్రోగసీ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. అయితే నిజానికి సరోగసీని ఎంచుకుని చాలామంది సెలబ్రెటీలు తల్లిదండ్రులుగా మారారు. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మంచి లక్ష్మి ముందుస్థానంలో ఉంది.
ఈమె సరోగసీ ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. బాలీవుడ్లో అయితే ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్రావు జంట కూడా 2011లో సరోగసీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. కిరణ్ రావు గర్భాశయ సమస్యలతో బాధపడుతుండటంతో వీరు సరోగసీని ఎంచుకున్నారు. షారుఖ్ ఖాన్, గౌరీఖాన్ జంట కూడా 2013లో సరోగసీ ద్వారా మూడో సంతానాన్ని పొందింది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా జంటకు కూడా సరోగసీ ద్వారానే రెండో సంతానాన్ని పొందారు. 2016లో తుషార్ కపూర్ సరోగసీ ద్వారా బిడ్డను పొందాడు. ఆ తర్వాత ఏక్తాకపూర్ కూడా అదే పద్ధతిని అనుసరించింది. 2019లో ఏక్తాకపూర్కు మగబిడ్డ జన్మించాడు.
సోహెల్ ఖాన్, సీమా జంట కూడా మొదటి సంతానం కలిగిన పదేళ్లకు సరోగసీని ఆశ్రయించింది. సింగిల్గా ఉండాలని నిర్ణయించుకున్నందున బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా 2017లో సరోగసీ ద్వారానే కవల పిల్లలను పొందాడు. 2018లో లిసా, జాసన్ డెహ్నీలు అద్దె గర్భం ద్వారా కవల పిల్లలను పొందారు. క్యాన్సర్ బారిన పడి మందులు వాడుతున్నందున లిసా సరోగసీని ఆశ్రయించింది. 2018లోనే సన్నీలియోని సరోగసీ ద్వారా కవలపిల్లలకు తల్లి అయ్యింది. 2019లో శ్రేయాస్ తల్పాడే, దీప్తి సరోగసీ ద్వారా ఆడ బిడ్డను పొందారు. తమకు పెళ్లయి 14 ఏళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో అద్దె గర్భాన్ని ఆశ్రయించారు.
2021లో ప్రీతిజింటా, జీస్ గూడెనఫ్ జంట సరోగసీ ద్వారా కవలపిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. తనకు రెండుసార్లు గర్భస్రావం కావడంతో అద్దె గర్భం ద్వారా ఆమె తల్లిగా మారానని ప్రీతిజింటా అప్పట్లో వివరణ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోసస్ దంపతులు కూడా బిడ్డ కోసం సరోగసినే ఎంచుకున్నారు. ఏదేమైనా చాలామంది మహిళలు అనారోగ్య సమస్యల కారణంగా సరోగసీ విధానంతో మాతృత్వ మధురిమలు పొందుతున్నారు. కానీ పెళ్లయి ఐదు నెలలు కూడా కాకముందే నయనతార జంట అద్దె గర్భాన్ని ఆశ్రయించి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అందుకే నయన్ , విఘ్నేశ్ జంటను ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు.