వైసిపి నిర్వహించిన బస్సు యాత్రకు జనం లేక వెలవెల పోతే.. మహానాడు దగ్గర కంట్రోల్ చెయ్యలేని స్థాయిలో జనం తరలిరావడం టిడిపి పై నమ్మకాన్ని చాటుతోందని చంద్రబాబు అన్నారు. గడప గడపకూ వైసిపిని.., గడప గడపకూ మన ప్రభుత్వం అని మార్చారని… అయినా వ్యతిరేక స్పందన రావడంతో…మళ్లీ బస్సు యాత్ర పెట్టారని వ్యాఖ్యానించారు.
బస్సు యాత్ర కూడా ఎలా ఫెయిల్ అయ్యిందో రాష్ట్ర ప్రజలు చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలి అని సూచించారు. మెంబర్ షిప్ డ్రైవ్ కూడా వేగవంతం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశంలో పార్టీ కమిటీల నియామకంపైనా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలని చెప్పారు.
ఇదే సమయంలో పార్టీలో ఏ స్థాయిలోను గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూపులు కట్టే వారి విషయంలో కఠినంగా ఉంటానని…ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక కార్యకర్తలు ఒంటరి వారు కాదన్న చంద్రబాబు.. వారికి కష్టం వస్తే పార్టీ చూసుకుంటుందని వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు పెంచాలని సూచించారు.