జైలు నుంచి వచ్చిన మరుక్షణం చంద్రబాబుకు కమెండోలు భద్రత కల్పించారు. భారీ కాన్వాయ్ నడుమ చంద్రబాబు ఉండవల్లి బయలుదేరారు. అయితే రోడ్డు మార్గంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవున హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
సుమారు 14 గంటలపాటు చంద్రబాబు రోడ్డు ప్రయాణం చేసి ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. అటు రాజధాని రైతులు, టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. అయితే తమ అధినేత 53 రోజులుగా జైల్లో ఉండి పోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. ఎట్టకేలకు బెయిల్ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రాజమండ్రి కి చేరుకున్నాయి. రాజమండ్రి నగరంతో పాటు రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా టిడిపి శ్రేణులు తరలిరావడంతో పట్టణం పసుపు మయంగా మారింది.
టిడిపి శ్రేణులను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రత్యేకంగా బారికేట్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తోసుకుంటూ కార్యకర్తలు జైలు వద్దకు దూసుకొచ్చారు. జైలు పరిసర ప్రాంతాలు చంద్రబాబు నినాదాలతో హోరెత్తాయి.