విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తన కుటుంబంతో కలిసి కొడాలి నాని దర్శించుకున్నారు. గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బ్యారికేడ్ ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ కారులోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో కొలువైన దుర్గామాత ఈ రోజు సరస్వతి రూపేణా కొలువైన ఉండటంతో ఆమెను తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు.
రాత్రి నుండే క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ దంపతులు అమ్మవారికి కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో ఆయన కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది.
మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను సందర్శించుకునేందుకు వచ్చారు కొడాలి నాని. తిరిగి వెళుతున్న సమయంలో దుర్గమ్మకు గుడి సమీపంలోని వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్ ను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాలేదు. ఆ కారులోనే నాని, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే వెంటనే పోలీసులు స్పందించారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు పరిశీలించగా.. ఏం లేదని నాని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే కొడాలి నాని కారుకు ప్రమాదం జరిగిందని తెలిసి ఆయన అనుచరులు, వైసీపీ నేతలు ఫోన్లు చేసి ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా, కొడాలి నాని మేనకోడలి వివాహం గురువారమే జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కంకిపాడుతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ పాల్లొని, వధూవరూలను ఆశీర్వదించారు. మరుసటి రోజే ఆయన అమ్మవారిని దర్శించుకోగా.. తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.