ఎన్నికలు అనగానే దిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులని..రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణపై రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారని ఆరోపించారు. రాహుల్ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అని ఎద్దేవా చేశారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయంతో రికార్డు సృష్టించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని విషయాల్లో విపక్షాలకంటే ముందే ఉంటున్నారు. షెడ్యూల్కు 50 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించారు. అన్ని పార్టీలకన్నా ముందే మేనిఫెస్టో ప్రకటించారు.
ఫ్లాష్ స్కీంలతో మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ బీమా పేరుతో 93 లక్షల కుటుంబాలను ప్రభావితం చేయనున్నారు. పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీబంధు తదితర స్కీంలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.