రాగి జావలో క్యాల్షియం, పీచుపదార్థం , మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక రాగి జావను తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. రాగులను ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే.
ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి. రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి.
రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో రాగి పిండి కలిపి జావలా చేసుకోని తాగాలి. రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోవచ్చు.