ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని… ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా తమకు రూ. 400 కోట్లు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని చెప్పారు.
అయితే చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, ఆయనను ఎవరూ క్షోభకు గురి చేయలేరన్నారు. ఆయన ధైర్యంగా ఉంటారన్నారు. చంద్రబాబు అరెస్టుకు మహిళలు నిరసన తెలుపుతుంటే వారిపట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే ఏపీలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ కుటుంబానికి చంద్రబాబు పెద్ద అని, పోలీసులు ఏం చేసినా కార్యకర్తలైన టీడీపీ పిల్లలు బెదరరన్నారు.
చంద్రబాబు చేతితో ప్లేట్ పట్టుకొని భోంచేస్తున్నారని, ఆయన భోంచేయడానికి కనీసం టేబుల్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భోంచేయడానికి టేబుల్ ఇవ్వడానికి తమ లాయర్ అనుమతి కోసం లెటర్ పెట్టవలసి వచ్చిందన్నారు. అనుమతిచ్చాకే టేబుల్ ఇచ్చారని, అలా ఆయనను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ఆయన ధైర్యంగా ఉంటారన్నారు.