హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుంది. అయితే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. టాలీవుడ్లోనూ ఒక పెద్ద సినిమాలో కథానాయికగా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన చేసిన ఆ చిత్రమే ఏక్ నిరంజన్. ఐతే అందులో ఆమె పాత్ర పెద్దగా క్లిక్ కాలేదు. సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో కంగనా మళ్లీ టాలీవుడ్లో కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో ఆమె పెద్ద రేంజికి వెళ్లింది. నిజానికి ఏక్ నిరంజన్ కంటే ముందు పూరి తీసిన బ్లాక్బస్టర్ మూవీ పోకిరిలో ఆమె కథానాయికగా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమాను తనే వదులుకోవాల్సి వచ్చిందని కంగనా రనౌత్ చంద్రముఖి-2 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
పూరి సర్ నాకెంతో నచ్చిన డైరెక్టర్. అసలు నా ప్రతిభను గుర్తించిందే ఆయన. కెరీర్ ఆరంభంలోనే నన్ను చూసి పెద్ద స్టార్ అవుతానని అంచనా వేశారు. మహేష్ బాబుతో పోకిరి సినిమాకు ఆయన నన్నే కథానాయికగా ఎంచుకున్నారు. ఐతే అదే సమయంలో నాకు గ్యాంగ్స్టర్ మూవీలో ఆఫర్ వచ్చింది. సరిగ్గా అక్టోబరులో రెండు సినిమాలకూ డేట్లు అవసరం అయ్యాయి. నేను గ్యాంగ్స్టర్ మూవీనే ఎంచుకున్నాను. పోకిరి సినిమాను వదులుకున్నందుకు బాధ అనిపిస్తుంటుంది అని కంగనా వెల్లడించింది.