ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు విచారణ అనంతరం నిన్న అంటే ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరపున వాదించేందుకు సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకుంది. సీఐడీ తరపున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు విన్పించారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా దాదాపు 8 గంటల సేపు వాదనలు కొనసాగాయి.
ప్రధానంగా సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదనే అంశంపైనే డిఫెన్స్ వాదించింది. మద్యాహ్నం 3 గంటలకు తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు..సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తీర్పు వెల్లడించింది. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తిస్తుందని తెలిపింది. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. భారత్లోని టాప్ 10 లాయర్ల జాబితాలో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. న్యాయ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక్క పర్యాయం కోర్టుకు రావడానికి ఆయన రూ. 5 లక్షలు ఫీజు తీసుకుంటాడు.

రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలు అవి అదనం. కేసును బట్టి గంటకు రూ. 15 లక్షల వరకూ ఫీజు తీసుకునే లాయర్లు కూడా భారత్లో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. సిద్ధార్థ్ లూథ్రా తండ్రి కేకే లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా.. న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. 1990లో LLB పూర్తి చేశారు. రాజ్యాంగ చట్టాలు, మానవ హక్కులు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు పుస్తకాలను కూడా రాశారు. భారత్తో పాటు ఇతర దేశాల కోర్టుల్లో కూడా సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ కు ఉంది.